పీజీ నీట్ పరీక్ష వాయిదా వేయలేం.. : సుప్రీంకోర్టు

ఎగ్జామ్ కోసం 2.06 లక్షల మంది సన్నద్ధమవుతున్నారన్న న్యాయస్థానం
వాయిదా వేస్తే డాక్టర్ల కొరత కూడా వచ్చే ప్రమాదముందున్న జస్టిస్ చంద్రచూడ్

న్యూఢిల్లీ: పీజీ వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)ను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వాయిదా వేస్తే ఇప్పటికే ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నష్టపోతారని వ్యాఖ్యానించింది. పరీక్ష కోసం దాదాపు 2.06 లక్షల మందికిపైగా విద్యార్థులు సన్నద్ధమవుతున్నారని, ఇలాంటి సందర్భంలో పరీక్ష వాయిదా వేసి వారికి నష్టం చేకూర్చలేమని తేల్చి చెప్పింది.

దాని వల్ల ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత కూడా వచ్చి పడే ప్రమాదముందని వ్యాఖ్యానించింది. పీజీ నీట్ ను వాయిదా వేయాలన్న పిటిషన్ ను ఇవాళ విచారించిన జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఆ పిటిషన్ ను బుట్టదాఖలు చేసింది. ఇప్పటికే అకడమిక్ షెడ్యూల్ నాలుగు నెలలు ఆలస్యమైందని, మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని నీట్ 2022–23ని ఆలస్యంగా ప్రకటించారని ధర్మాసనం పేర్కొంది. పీజీ నీట్ ను వాయిదా వేయాలని పేర్కొంటూ వ్యాజ్యం వేసిన వాళ్లూ 2021 నీట్ పీజీ కౌన్సెలింగ్ లో పాల్గొన్నారని, వారు నీట్ 2022 రాయకుండా ఎవరూ అడ్డుకోలేదని గుర్తు చేసింది.

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నీట్ కు దరఖాస్తు చేసుకున్న వారినీ దృష్టిలో పెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. కొందరి కోసం ఎక్కువ మందికి నష్టం చేయలేమంది. దాంతో పాటు పేషెంట్ల బాగోగులనూ మరువొద్దని సూచించింది. ఇప్పుడు పరీక్షను వాయిదా వేస్తే కష్టాలు, అస్థిరత చోటు చేసుకునే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. అయితే, నీట్ పీజీతో పాటు ఈ ఏడాది కౌన్సెలింగ్ డేట్లు క్లాష్ అవుతున్నాయని, అందుకే వాయిదా వేయాలని కోరుతున్నామని పిటిషనర్ల తరఫు అడ్వొకేట్ వాదించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/