వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, కేంద్రానికి నోటీసులు

మీది బిలియన్‌, ట్రిలియన్‌ డాలర్ల కంపెనీ కావచ్చు. కానీ ప్రజల వ్యక్తిగత గోప్యత అంతకన్నా విలువైనది…సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ కొత్త ప్రైవ‌సీ పాల‌సీపై దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీం విచార‌ణ జ‌రిపింది. నాలుగు వారాల్లో నోటీసుల‌కు స‌మాధానం ఇవ్వాల‌ని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల‌ను ఆదేశించింది. ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ఆ సంస్థ‌కు చుర‌క‌లు అంటించింది.

‘మీది బిలియన్‌, ట్రిలియన్‌ డాలర్ల కంపెనీ కావచ్చు. కానీ ప్రజల వ్యక్తిగత గోప్యత అంతకన్నా విలువైనది. దానిని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల తమ గోప్యతకు భంగం వాటిల్లుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాము ఎవరో ఒకరికి పంపిన సందేశాలను వాట్సాప్‌, ఫేస్‌బుక్‌తో పంచుకోవడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రైవసీని కాపాడటం కోసం మేం తప్పక జోక్యం చేసుకుంటాం’ అని తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్రంతో పాటు, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తరఫున కపిల్‌ సిబాల్‌, అరవింద్‌ దాతర్‌ తమ వాదనలు వినిపించారు. ప్రైవసీకి భంగం కలుగుతుందనే ఆరోపణలు వాస్తవం కాదని తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/