నేటి నుంచి సుప్రీంకోర్టులో విచారణలు ప్రత్యక్ష ప్రసారం
న్యూఢిల్లీః నేటి నుండి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ లైవ్ ప్రొసీడింగ్స్ను తొలుత యూట్యూబ్లో ప్రసారం చేయనున్నారు. రానున్న రోజుల్లో సుప్రీం సొంత వేదిక ద్వారానే విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సుప్రీంకోర్టులో కేసుల విచారణ లైవ్ స్ట్రీమింగ్కు అనుకూలంగా 2018లో నిర్ణయం తీసుకున్నారు. మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ రోజు ఆగస్టు 26న తొలిసారి సుప్రీం విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసుల వరకే లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. త్వరలోనే అన్ని ధర్మాసనాల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలో గత మంగళవారం జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో నిర్ణయించారు. లైవ్ ఇచ్చేందుకు న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా.. సుప్రీంకోర్టు సిబ్బంది అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. https://main.sci.gov.in/display-board లేదా https://webcast.gov.in/scindia/ లో వేర్వేరు ధర్మాసనాల విచారణల ప్రత్యక్ష ప్రసారం లింకులు అందుబాటులో ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ కోటా; ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రం, శివసేన వివాదం; ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ చెల్లుబాటుపై మూడు వేర్వేరు ధర్మాసనాల విచారణల్ని ఇక్కడ చూడొచ్చు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/