కేరళ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

వ్యాపారుల డిమాండ్ల కోసం ఆరోగ్య హక్కును కాలరాయడమా?

న్యూఢిల్లీ : కేరళ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బక్రీద్ ను పురస్కరించుకుని కరోనా ఆంక్షల నుంచి మూడు రోజుల మినహాయింపు ఇచ్చి వ్యాపారుల డిమాండ్ కు తలొగ్గి ఆంక్షలను సడలిస్తున్నారంటే.. రాష్ట్రంలో పాలనా వ్యవహారాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది. కేరళ ప్రభుత్వ నిర్ణయం విస్మయానికి గురిచేస్తోందని మండిపడింది.

వ్యాపారం చేసుకునేవారి డిమాండ్లను నెరవేర్చడానికి ప్రజల ఆరోగ్య హక్కును కాలరాయరాదని హెచ్చరించింది. ఇప్పటికే ఆంక్షల ఎత్తివేత అమల్లోకి వచ్చినందున.. కేరళ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను కొట్టివేయలేమని స్పష్టం చేసింది. ఈ మినహాయింపులతో కరోనా కేసులు భారీగా పెరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి మినహాయింపులివ్వడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 144ను కేరళ ప్రభుత్వం ఒకసారి క్షుణ్ణంగా చదువుకోవాలని, కన్వర్ యాత్ర కేసుకు సంబంధించి తామిచ్చిన ఆదేశాలను ఇక్కడా పాటించాలని ఆదేశించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/