జులై 31 లోగా ఇంటర్​ ఫలితాలను వెల్లడించాలి..సుప్రీం కోర్టు

అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డులకు ఆదేశం

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు దేశ వ్యాప్తంగా 12 వ తరగతి విద్యార్థుల ఫలితాలపై ఆదేశాలు జారీ చేసింది. జులై 31 లోగా ఇంటర్మీడియట్ ఫలితాలను వెల్లడించాల్సిందిగా అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డులను ఆదేశించింది. అందుకు పది రోజుల్లోగా ఇంటర్నల్ అసెస్ మెంట్ పూర్తి చేయాలని సూచించింది. కాగా, ఈ నెల మొదటి వారంలో విద్యార్థుల మార్కులకు సంబంధించి ప్రత్యామ్నాయ పద్ధతులను పరిశీలించాల్సిందిగా సీబీఎస్ఈ, సీఐఎస్ సీఈలను సుప్రీం కోర్టు ఆదేశించింది. అన్ని రాష్ట్రాల బోర్డుల మాదిరే సీబీఎస్ఈ, సీఐఎస్ సీఈ కూడా జులై 31లోగా ఫలితాలను వెల్లడించాలని పేర్కొంది.

గత వారమే రెండు బోర్డులు కూడా మార్కులు వేసే విధానాన్ని కోర్టుకు సమర్పించాయి. ఆ అఫిడవిట్ పై సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు.. వ్యతిరేకించేందుకు ఆ విధానాల్లో లోపాలేవీ లేవని వ్యాఖ్యానించింది. పరీక్షలు నిర్వహించాలన్న కొందరు విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. కాగా, ఇప్పటిదాకా 21 రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలను రద్దు చేయగా.. ఆరు రాష్ట్రాల్లో నిర్వహించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/