రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు..ఆరెంజ్ అలెర్ట్ జారీ

హైదరాబాద్: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పడే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణాగ్రతలు దాటాయి. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వడగాలులు మరింతగా వీస్తాయని.. 4 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం ఎండల్లో బయట తిరగవద్దంటూ ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేసింది. ఏప్రిల్‌ ఒకటి, రెండు తేదీల్లో రాష్ట్రంలోని ఉత్తర, వాయువ్య జిల్లాల్లో వడగాలులు వీచే ప్రమాదముందని పేర్కొంది. రాజస్తాన్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణలోకి పొడిగాలులు వీస్తున్నందున ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటున్నాయని, వేడి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కరిమెరిలో బుధవారం అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది. గత పదేళ్ల మార్చి నెల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు ఇదే. చప్రాలా, జైనథ్‌లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 41.4, రామగుండంలో 41.2, నల్గొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కూడా 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/