మార్చి తొలి వారం నుంచే ఎండలు..రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ
ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఆరోగ్య శాఖ సూచనలు
న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా మార్చి తొలి వారం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు ఇప్పటికే అసాధారణ స్థాయికి పెరిగాయని పేర్కొంది. వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు పలు సూచనలు చేసింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లకు లేఖలు రాశారు. ఎండ తీవ్రత వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించి రోజువారీ సర్వీలెన్స్ చర్యలు చేపట్టాలని సూచించారు.
అనారోగ్యాలు, డెత్స్ వివరాలను మార్చి 1 నుంచి ఎన్ సీడీసీ వెబ్ సైట్లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. నేషనల్ ప్రోగ్రాం ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ జారీ చేసే హీట్ వేవ్ అలర్ట్ లను బట్టి ఆయా ప్రాంతాల అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎండలో పనిచేసేవాళ్లకు, గుండెజబ్బు బాధితులు, హైబీపీ ఉన్నవారు, గర్భిణీలు, వృద్ధులు, పిల్లలకు రిస్క్ ఎక్కువని, వీరి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.