సుమంత్ అశ్విన్, శ్రీకాంత్ చిత్రం ప్రారంభం

Sumanth Aswin_Srikanth New Movie

నలుగురు అపరిచితులు.. 3,450 కిలోమీటర్ల దూరం రోడ్డుపై ప్రయాణం.. వాళ్ల ప్రయాణం దేనికోసం.. ఆ ప్రయాణంలో వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలేమిటి?.. ఈ కాన్సెప్టుతో గురుప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1గా ఒక చిత్రాన్ని ప్రారంభించారు నిర్మాత జి. మహేష్. నలుగురు అపరిచితులుగా సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని నటిస్తున్నారు. రాంగోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, నగేష్ కుకునూర్ వంటి సుప్రసిద్ధ దర్శకుల వద్ద పనిచేసిన గురుపవన్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. బుధవారం ఈ సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ కు ఎన్.బి. బాలసుబ్రహ్మణ్యం క్లాప్ నివ్వగా, సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో దర్శకుడు గురుపవన్ మాట్లాడుతూ, “మహేష్ మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. భిన్న నేపథ్యాలు కలిగిన నలుగురు అపరిచితులు హైదరాబాద్ నుంచి బైకులపై చేసే ప్రయాణం ఈ సినిమా. ఏ కారణంతో వాళ్లు ఆ ప్రయాణం మొదలుపెట్టారు, వాళ్లు ఎలాంటి పరిస్థితులు, అనుభవాలు ఎదుర్కొన్నారనేది ఇందులోని ప్రధానాంశం. మార్చి 2న తొలి షెడ్యూలు, మార్చి 22 నుంచి రెండో షెడ్యూలు జరుగుతాయి. హైదరాబాద్, ఝాన్సీ, నాగపూర్, గ్వాలియర్, మనాలి వంటి లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతాం. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుంది” అని చెప్పారు.

హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, “ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఉత్సాహంతో ఎదురుచూస్తున్నా. శ్రీకాంత్, ఇంద్రజ వంటి ఫెంటాస్టిక్ యాక్టర్లతో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ‘పెళ్లి సందడి’ సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అప్పుడు నేను చాలా చిన్నవాడ్ని. ఇప్పుడు ఆ సినిమా హీరో శ్రీకాంత్ గారితో పనిచేస్తుండటం హ్యాపీ. ఇది మంచి సినిమా అవుతుంది” అన్నారు.

నటి ఇంద్రజ మాట్లాడుతూ, “ఈ స్టోరీ చాలా డిఫరెంట్ గా, వెరైటీగా ఉంది. నటనకు అవకాశం ఉన్న ప్రధాన పాత్ర చేస్తున్నా. మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్న నాకు ఒక ఫీస్ట్ లాంటి క్యారెక్టర్ ఇచ్చారు. తన కలలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే ఒక గృహిణిగా నటిస్తున్నా. రెండు రకాల లుక్స్ లో కనిపిస్తా. సుమంత్ అశ్విన్ కెరీర్ లో బాగా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. శ్రీకాంత్, నేను ‘జంతర్ మంతర్’ సినిమాతో ఒకేసారి సోలో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యాం. ఇన్నాళ్లకు ఆయనతో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది” అని చెప్పారు.

హీరోయిన్ ప్రియ వడ్లమాని మాట్లాడుతూ, “ఇంద్రజ, శ్రీకాంత్ లాంటి పేరుపొందిన నటులతో కలిసి పనిచెయ్యడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇది ఎగ్జైటింగ్ స్క్రిప్టుతో తయారవుతున్న సినిమా” అన్నారు.

సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ, “డైరెక్టర్ గురుపవన్ చెప్పిన కథ చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. బ్యాగ్రౌండ్ స్కోర్ కు బాగా అవకాశమున్న కథ” అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చిరంజీవి ఎల్. మాట్లాడుతూ, “ఈ సినిమా మరో చరిత్ర సృష్టిస్తుందనే నమ్మకం ఉంది. ఇది సందేశాత్మక, వినోదాత్మక చిత్రం” అని తెలిపారు.

నిర్మాత మహేష్ మాట్లాడుతూ, “నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. ఏడు నెలల క్రితం దర్శకుడు గురుపవన్ చెప్పిన కథ బాగా నచ్చి ఈ సినిమాతో చిత్రరంగంలో అడుగుపెడుతున్నా. అన్ని వయసుల వారికీ చేరువయ్యే కథ ఇది. చక్కని అడ్వంచరస్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది” అని చెప్పారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/