కేటీఆర్ ఉద్యమానికి సుద్దాల అశోక్ తేజ సపోర్ట్

చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీకి స్వయంగా కేటీఆర్ పోస్ట్ కార్డు ద్వారా లేఖ రాశారు. జీఎస్టీ విధించడం వల్ల చేనేత రంగం పూర్తిగా నిర్వీర్యం అయ్యే అవకాశముందని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామంటూ పోస్ట్ కార్డు ఉత్తరాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. అలాగే ప్రతి ఒక్కరు ప్రధానికి లేఖ రాయాలని పిలుపునిచ్చారు. మోడీ ఫై కేటీఆర్ ప్రకటించిన ఈ పోరాటానికి ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు మద్దతునిచ్చారు. తాజాగా టాలీవుడ్ కూడా కేటీఆర్ కు సపోర్ట్ గా నిలిచింది.

టాలీవుడ్ ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కూడా కేటీఆర్ పోస్ట్ కార్డ్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ తన చేతులతో స్వయంగా ప్రధాని మోడీకి ఉత్తరం చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో విడుదల చేశారు. చేనేతల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, అనేక కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు. ప్రభుత్వం చేనేతలతో స్వయంగా చీరలు తయారుచేయించి బంతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేస్తున్న విషయాన్ని సుద్దాల అశోక్ తేజ గుర్తు చేశారు. చేనేత రంగాన్ని కాపాడేందుకు కేటీఆర్ చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి ప్రతిఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై విధించిన జీఎస్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేయాలని సూచించారు.