శుక్రవారం నుండి పూర్తిస్థాయి వరి కొనుగోళ్లు చేస్తామని తెలిపిన మంత్రి గంగుల కమలాకర్‌

యాసంగి వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుపడంతో రైతుల్లో ఆనందం మొదలైంది. మొన్నటి వరకు వరి కొనుగోలు చేస్తారో లేదో..అని టెన్షన్ పడ్డ రైతులు..కేసీఆర్ ప్రకటన తో ఊపిరి పీల్చుకుంటున్నారు. శుక్రవారం నుండి రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు ప్రారంభిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎల్లుండి నుంచి పూర్తిస్థాయి కొనుగోళ్లు మొదలవుతాయని చెప్పారు. మే చివరి నాటికి పూర్తిగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేస్తామని తెలిపారు. తెలంగాణ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

తెలంగాణలో పొరుగు రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేయమని చెప్పారు. ఆధార్ కార్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీ ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రైతు అని నిర్ధారించుకోవడానికే ఈ సిస్టం ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. పక్కనున్న రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బందుల కారణంగా ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చి అమ్ముతారనే సమాచారం ఉందని తెలిపారు. ఇందుకోసం తెలంగాణలో 51 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మిల్లర్లకు ధాన్యం చేరిన తర్వాత ప్రభుత్వానికి మెసేజ్ రాగానే మూడు రోజుల్లోనే రైతులకు డబ్బు జమ అవుతుందని వెల్లడించారు. ఏ ఒక్క రైతు కూడా తక్కువ ధరలకు తమ ధాన్యాన్ని అమ్ముకోవద్దని… కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయించాలని సూచించారు.