దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆందోళనకరం : చిదంబరం

వృద్ధి రేటు రోజురోజుకూ ప‌డిపోతోందన్న చిదంబ‌రం

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నేత‌లు నిర్వ‌హించిన ఓ సమావేశంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ చిదంబ‌రం పాల్గొని మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మంద‌గ‌మ‌నంలో ఉన్న‌ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశ ఆర్థిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉందని, వృద్ధి రేటు రోజురోజుకూ ప‌డిపోతోంద‌ని చెప్పారు. ద్ర‌వ్యోల్బ‌ణం ఎన్న‌డూ ఊహించ‌ని స్థాయికి చేరుకుంద‌ని అన్నారు.

పెట్రోల్, డీజిల్ ప‌న్నులు కూడా ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుద‌ల‌కు కార‌ణాల‌ని ఆయ‌న ఆరోపించారు. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ దిగ‌జార‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం అవ‌లంబిస్తోన్న‌ విదేశీ వ్య‌వ‌హారాల తీరు కూడా ఓ కార‌ణ‌మ‌ని ఆయ‌న చెప్పారు. ఊహించ‌ని స్థాయికి ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగింద‌ని ఆయ‌న అన్నారు. దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిపోతున్న‌ప్ప‌టికీ దాన్ని కేంద్ర స‌ర్కారు క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతోంద‌ని ఆయ‌న చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/