శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : పలాస హాస్పటల్ సూపరింటెండెంట్ దుర్మరణం

ప్రతి రోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్ స్పీడ్ , మద్యం మత్తులో డ్రైవ్ చేయడం , నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలాస హాస్పటల్ సూపరింటెండెంట్ తో పాటు ఆయన కుమారుడు మృతి చెందగా భార్య, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. పలాస హాస్పటల్ సూపరింటెండెంట్ మడే రమేశ్ (45).. ఆయన భార్య ప్రసన్న లక్ష్మి (45), కుమార్తె సైర్య (14), కుమారుడు సంకల్ప్ (10)తో కలిసి కారులో విశాఖపట్టణం నుంచి పలాసకు బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెదనాయుడుపేట వద్ద జాతీయ రహదారిపై వారి కారు అదుపుతప్పి వంతెన రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న రమేశ్, కుమారుడు సంకల్ప్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రసన్న లక్ష్మి, సైర్య తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన లక్ష్మి, సైర్యలను శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.