మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్న శ్రీరామనవమి శోభాయాత్ర

sri-rama-shobha-yatra-starts-at-1-pm-from-sitaram-bagh-to-hanuman-vyayam-shala-hyderabad

హైదరాబాద్‌ః ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో ఏటా నిర్వహించే శోభాయాత్ర మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఓల్డ్‌సిటీలోని సీతారాంబాగ్‌ రామాలయంలో స్వామివారి కల్యాణం జరుగుతున్నది. కల్యాణం అనంతరం స్వామివారి శోభాయాత్రను ఉత్సవ సమితి ఆరంభించనుంది. సీతారాంబాగ్‌ ఆలయం-బోయగూడ కమాన్‌ నుంచి మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ రోడ్డు, జాలి హనుమాన్‌, దూల్‌పేట, పురానాపూల్‌, జుమేరాత్‌ బజార్‌, చుడిబజార్‌, బేగంబజార్‌ చత్రి, బర్తన్‌ బజార్‌, సిద్దంబర్‌ బజార్‌ మసీదు, శంకర్‌ షేర్‌ హోటల్‌, గౌలిగూడ కమాన్‌, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్‌ మీదుగా సుల్తాన్‌ బజార్‌లోని హనుమాన్‌ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది. మంగళ్‌హాట్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆధ్వర్యంలో ఆకాశ్‌పురి నుంచి మరో శాభాయాత్ర జరుగునుంది.

ఈ నేపథ్యంలో నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 వందల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. శోభాయాత్ర జరిగే మార్గంలో ఇప్పటికే బారికేడ్లు ఏర్పాటుచేశారు. శోభాయాత్ర మార్గంలో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఉంచారు. సాయంత్రం 8 గంటల లోపు యాత్ర ముగించేలా ఏర్పాట్లు చేశారు. యాత్ర సాగుతున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.