రాజాసింగ్ ని విడుదల చేయకుంటే హైదరాబాద్ ను ముట్టడిస్తాం – అఖిల భారత శ్రీరామ్ సేన

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ని పది రోజుల్లో విడుదల చేయకపోతే హైదరాబాద్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు అఖిల భారత శ్రీరామ్ సేన. రాజాసింగ్ అరెస్ట్ పై కర్ణాటకకు చెందిన అఖిల భారత శ్రీరామ్ సేన తీవ్రంగా స్పందించింది. ఈ సంఘం జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ మూతాలిక్ మీడియాతో మాట్లాడుతూ.. పది రోజుల్లో రాజాసింగ్ ను విడుదల చేయకపోతే హైదరాబాద్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాజాసింగ్ ను కలవడానికి జైలుకు వెళ్తే అనుమతించలేదని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన ఏమైనా టెర్రరిస్టా.. ఎందుకు కలవనివ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే పై అక్రమ పిడియాక్ట్ పెట్టడం మేము తీవ్రంగా కండిస్తున్నామన్నారు.

జైలులో ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు.. రాజాసింగ్ కు ఏమైనా జరిగితే కేసీఆరే బాధ్యుడని అన్నారు. రాజాసింగ్ పై పెట్టిన కేసులు ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే..లక్షలాది మందితో హైద్రాబాద్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అందులో ఎలాంటి సంఘటనలు జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఒక ముస్లిం మునవర్ ఫారూఖ్ అలీ హిందువు దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఎలా ఉరుకుంటామని.. హిందూ దేవుళ్లను కించపరిచిన మునవర్ ఫారుకీ షోకు ప్రభుత్వం ఎందుకు పరిమిషన్ ఇచ్చింది? అని ప్రశ్నించారు. హైద్రాబాద్ లో ఆందోళనకు కారణం తెలంగాణ ప్రభుత్వమేనని ఆరోపించారు.