స్పుత్నిక్‌ లైట్ టెస్టులకు డీసీజీఐ అనుమతి

న్యూఢిల్లీ : రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ లైట్ మూడో దశ ప్రయోగాలకి కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఒక్క డోసు టీకా మూడో దశ ప్రయోగాలను భారత్‌లో నిర్వహించేందుకు DCGI అనుమతి మంజూరు చేసినట్లు తెలుస్తోంది. డీసీజీఐ అనుమతులు రావడంతో అతి త్వరలో ఈ టీకా ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ప్రయోగాల్లో పాల్గొనే వారి ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సమాచారం. మూడో దశ ట్రయల్స్‌ నిమిత్తం ఇప్పటికే కొన్ని టీకాలను నాణ్యత, భద్రత తనిఖీలకు పంపినట్లు సమాచారం.

కరోనా మహమ్మారి నియంత్రణ కోసం రష్యాకు చెందిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ఈ స్పుత్నిక్‌ లైట్‌ టీకాను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల మాదిరి కాకుండా ఇది ఒక్క డోసు వ్యాక్సిన్‌. ఇది కరోనాపై 78.6శాతం నుంచి 83.7శాతం సమర్థతతో పనిచేస్తుందని ఆర్‌డీఐఎఫ్‌ వెల్లడించింది. దీన్ని భారత్‌లోకి తీసుకొచ్చేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ రష్యాతో ఒప్పందం చేసుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/