దేశం మొత్తం వారి చేతుల్లోనే ఉంది

‘వ్యవసాయం ఖూనీ’ అనే పుస్తకాన్ని విడుదల చేసిన రాహుల్‌ గాందీ

YouTube video
 Special Press Briefing by Shri Rahul Gandhi at AICC HQ

న్యూఢిల్లీ: దేశం మొత్తం నలుగురైదుగురి చేతుల్లోనే నడుస్తోందని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాందీ ఆరోపించారు. ఎయిర్ పోర్టులు, విద్యుత్, టెలికాం రంగాల్లో వారి ప్రభావం ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని, ఇప్పుడు వ్యవసాయ రంగంపైనా వారి కన్ను పడిందని అన్నారు. మంగళవారం ఆయన ‘వ్యవసాయం ఖూనీ’ అనే పుస్తకాన్ని విడుదల చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.

దేశ వ్యవసాయ రంగాన్ని సాగు చట్టాలు నాశనం చేస్తాయని మండిపడ్డారు. దేశమంతా క్రోనీ క్యాపిటలిస్టుల (ఆశ్రిత పెట్టుబడిదారులు) చేతుల్లోనే ఉందని, వారందరికీ ప్రధాని నరేంద్ర మోడితో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. వారికి మీడియా మద్దతును ఇస్తోందన్నారు. సాగు చట్టాలతో మార్కెట్ వ్యవస్థ నాశనం అవుతుందని, నిత్యావసర సరుకుల చట్టాన్ని తుంగలోకి తొక్కేస్తుందని ఆరోపించారు. అంతేగాకుండా రైతులు తమ హక్కులను కాపాడుకోవడానికి కోర్టుకు వెళ్లకుండా కూడా వ్యవసాయ చట్టాలు అడ్డుకుంటాయన్నారు. చట్టాలతో రైతులకు మద్దతు ధర లభించదన్నారు.

ఈ చట్టాల వల్ల వ్యవసాయం మొత్తం ఆ నలుగురైదుగురు వ్యక్తుల చేతుల్లోకే వెళ్తుందన్నారు. కొన్ని లక్షల టన్నుల ధాన్యాన్ని క్రోనీ క్యాపిటలిస్టులే నిల్వ చేసుకుంటారని రాహుల్ ఆరోపించారు. దాని వల్ల మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుందని, ధరలు ఊహించనంతగా పెరుగుతాయని హెచ్చరించారు. ఈ గుత్తాధిపత్యానికి తెర దించాల్సిన అవసరం ఉందన్నారు. పంజాబ్, హర్యానా రైతులు దేశభక్తులని, ఈ దేశ బతుకుదెరువును కాపాడేందుకు పోరాడుతున్నారని అన్నారు. ప్రజల కోసమే రైతులు పోరాటం చేస్తున్నారని, వారికి అందరూ మద్దతునివ్వాలని రాహుల్ కోరారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/