వ్లాదిమిర్ పుతిన్ కోసం భారీ టన్నెల్ ఏర్పాటు
వైరస్ సోకకుండా అధికారిక నివాసం ముందు అత్యాధునిక టన్నెల్
రష్యా: రష్యాలో కరోనా నేపథ్యంలో ఆదేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు కరోనా వైరస్ సోకకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన అధికారిక నివాసమైన నోవో-ఒగార్యోవో ముందు అత్యాధునిక డిజిన్ఫెక్షన్ టన్నెల్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడే తనను కలిసేందుకు వచ్చిన వారిని పుతిన్ కలుస్తారు. పెంజా పట్టణానికి చెందిన ఓ రష్యన్ కంపెనీ దీన్ని తయారు చేసింది. అయితే ఈ టన్నెల్ లోకి ప్రవేశించిన వారిపై రసాయనాలు చిలకరించబడతాయి. దీంతో వారిపై ఏవైనా కరోనా క్రిములు, ఇతర వైరస్ లు చేరివుంటే అవి నశిస్తాయి. ఆ తరువాతే పుతిన్ వారిని కలుస్తారు. కాగా, ఇంతవరకూ రష్యాలో 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధికంగా కేసులు నమోదైన దేశాల్లో రష్యా మూడవ స్థానంలో ఉంది. ఇప్పటివరకూ 7,284 మంది వైరస్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/