గుంటూరు లో ఏస్పీ బాలు విగ్రహం తొలగింపు

గుంటూరులో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపు ఇప్పుడు వివాదస్పదంగా మారింది. గుంటూరులోని మదర్ థెరీసా సెంటర్ లో ఈ విగ్రహం ఉంది. అయితే, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అనుమతి లేదన్న కారణంతో ఎస్పీ బాలు విగ్రహాన్ని తొలగించారు. ఈ ఘటనతో కార్పొరేషన్‌ అధికారులపై కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కళా దర్బార్ సంస్థ అధ్యక్షుడు పొత్తూరు రంగారావు స్పందిస్తూ, మహాగాయకుడి విగ్రహం పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేసింది ఒక్క గుంటూరులోనే అని వెల్లడించారు. గుంటూరులో 200కి పైగా అనుమతి లేని విగ్రహాలు ఉన్నాయని, బాలు విగ్రహాన్ని ఎందుకు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటుకు అనుమతి కోరుతూ రెండేళ్లుగా అధికారులకు దరఖాస్తు చేశామని.. అధికారుల చుట్టూ తిరిగామని కళాదర్బార్‌ సభ్యులు అంటున్నారు. విగ్రహం ఏర్పాటు చేస్తే ఎందుకు తొలగించారని.. మహా గాయకుడికి కార్పొరేషన్‌ అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డారు.