రొనాల్డో ఆడని మ్యాచ్‌ టికెట్ ధర తిరిగివ్వండి

ది ఫాస్టా సంస్థకు ఇంచ్‌యోన్‌ కోర్టు ఆదేశం

Cristiano Ronaldo
Cristiano Ronaldo

సియోల్‌: గతేడాది వేసవిలో సియోల్‌లో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో మ్యాచ్ ఆడకపోవడంతో ఇప్పుడు తిరిగి డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయంలోకి వెళితే… గతేడాది జూలైలో ‘ది ఫాస్టా’ అనే సంస్థ కెలీగ్‌ ఆల్‌స్టార్స్, యువెంటాస్‌ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ నిర్వహించింది. ది ఫాస్టా సంస్థ పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో యువెంటాస్‌ తరఫున బరిలోకి దిగుతాడని ప్రచారం చేసింది. రొనాల్డో కనీసం 45 నిమిషాలు మ్యాచ్ ఆడతాడని అభిమానులకు చెప్పింది. రొనాల్డోకు ఉన్న క్రేజ్ కారణంతో 65 వేల టికెట్లు కేవలం మూడు నిమిషాల్లోపే అమ్ముడు పోయాయి. కొరియా కరెన్సీలో 30,000 వన్‌ల నుంచి 4,00,000 వన్‌ల వరకు (రూ.1800-రూ. 24,000) వెచ్చించి అభిమానులు టికెట్లు కొన్నారు. మ్యాచ్‌ రోజు సియోల్‌ స్టేడియానికి వచ్చి చూస్తే రొనాల్డో బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. కనీసం పది నిమిషాలైనా రొనాల్డో మ్యాచ్ ఆడిఉంటే.. కొరియన్లంతా ఎంతో సంతోషంగా ఉండేవారు. రొనాల్డో మ్యాచ్ ఆడకపోవడంతో నిరాశ చెందిన ఇద్దరు కొరియన్ అభిమానులు కోర్టులో కేసు వేశారు. విచారించిన ఇంచ్‌యోన్‌ జిల్లా కోర్టు ఒక్కొక్కరికి 3,71,000 వన్‌లు (రూ.22,285) చెల్లించాలని ‘ది ఫాస్టా’ సంస్థను ఆదేశించింది. కోర్టు తీర్పుతో అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/