ప్రయాణికులు గమనించగలరు : ఈరోజు , రేపు పలు రైళ్లు రద్దు
రెండు రోజుల క్రితం వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ వద్ద పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా క్షేమంగా ఉండడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అధికారులు రైల్వే ట్రాక్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనులు చేస్తున్నారు. దీంతో ఈరోజు , రేపు పలు రైలు సర్వీస్ లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రద్దైన వాటిలో మెదక్-కాచిగూడ, నాందేడ్-ఆదిలాబాద్, మహబూబ్నగర్-కాచిగూడ, వరంగల్-కాచిగూడ, సికింద్రాబాద్-వరంగల్, చిత్తాపూర్-సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి.
కాచిగూడ- మెదక్ (07850) మధ్య నడిచే రైలు ఈరోజు, రేపు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మెదక్ నుంచి కాచిగూడ (07588) మధ్య నడిచే రైలును ఫిబ్రవరి 17 నుంచి ఈనెల 19 వరకు రద్దు చేశారు. చిత్తూర్-సికింద్రాబాద్, రాయ్చూర్-గుంతకల్ మధ్య నడిచే రైళ్లు 17, 18 తేదీల్లో నడవవని తెలిపారు. వీటితో పాటు ఆదిలాబాద్-నాందేడ్ (17409), నాదేండ్-ఆదిలాబాద్ (1740), కాచీగూడ-కర్నూల్ సిటీ, కర్నూల్ సిటీ-కాచిగూడ, చిత్తాపూర్-సికింద్రాబాద్-చిత్తాపూర్, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-హైదరాబాద్, కాజిపేట్-వరంగల్, డోర్నకల్-విజయవాడ-డోర్నకల్, డోర్నకల్-కాజీపేట్, విజయవాడ-భద్రాచలం-విజయవాడ, కాచిగూడ-బోధన్, బోధన్-మహబూబ్నగర్, గుంతకల్-రాయ్చూర్ రైళ్లను రద్దుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు గమనించగలరని చెప్పుకొచ్చారు.