ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేతలతో రేపు సోనియాగాంధీ భేటీ!
న్యూఢిల్లీ: రేపు ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ మేరకు సోనియాగాంధీ రాష్ట్ర నేతలను ఢిల్లీకి ఆహ్వానించినట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై సోనియాగాంధీ పార్టీ నేతలతో చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ఎంతమంది నేతలు సిద్ధంగా ఉన్నారు..? వారిలో ఎవరిని తీసుకోవాలి.. ఎవరిని తీసుకోవద్దు. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ రెబల్స్గా పనిచేసినవాళ్లలో ఎంతమంది పార్టీలోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు..? వాళ్లలోనూ తీసుకోవాల్సింది ఎవరిని.. తీసుకోకూడనిది ఎవరిని అనే అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగనుంది. అదేవిధంగా ఉత్తరాఖండ్లో విపత్తు నిర్వహణ పనులపై కూడా సోనియా రాష్ట్ర నేతలతో సమీక్షించనున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/