గంగారామ్ హాస్పటల్ లో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు. జూన్ 02 న ఆమె కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి కరోనా తో బాధపడుతూ ఐసోలేషన్ లో ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆమె ఇంటికే పరిమితమయ్యారు. అయితే, కరోనా సంబంధిత సమస్యలతో ఆమె నేడు ఆసుపత్రిలో చేరారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

“కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ రోజు కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం స్థిరగా ఉంది. వైద్యుల పరిశీలన కోసం ఆస్పత్రిలో చేరారు. మేము కాంగ్రెస్ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.” అని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్‌ ద్వారా తెలియజేశారు.

జూన్ రెండో తేదీన సోనియాకు కరోనా వైరస్‌ సోకింది. దీంతో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ని గడువు కోరారు. ఈ మేరకు జూన్ 23న విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే ఈ కేసులో ఆమె కుమారుడు, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని కూడా జూన్ 13న ఈడీ ప్రశ్నించేందుకు సమన్లు పంపించింది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జూన్ 13న హాజరు కావాలని ఫెడరల్ ఏజెన్సీ రాహుల్ గాంధీని కోరింది.