తిరుపతి జిల్లాలో దారుణ ఘటన : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య

తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చంద్రగిరిలోని గంగుడుపల్లెలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాగరాజు ను అతి కిరాతకంగా పెట్రోల్ పోసి చంపేశారు. కారులో వెళ్తున్న నాగరాజును ఆపిన దుండగులు ఆపై పెట్రోలు పోసి నిప్పంటించారు. కారు నుంచి బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో బాధితుడు కారులోనే సజీవ దహనమయ్యాడు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో గుంగుడుపల్లె వద్ద ఈ ఘటన జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండడంతో కారు నంబరు ఆధారంగా వివరాలు సేకరించారు.

బాధితుడిని వెదురుకుప్పం మండలం బ్రహ్మణపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాగరాజుగా గుర్తించారు. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఆయన పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి బెంగళూరు నుంచి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, నాగరాజు హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.