హైదరాబాద్‌ అభివృద్ధి కోసం బిజెపికి మద్దతు తెలపాలి

జీహెచ్‌ఎంసీ పరిధిలో వేలకోట్లు ఖర్చు చేశామంటూ టిఆర్ఎస్ అబద్ధాలు

Smriti Irani

హైదరాబాద్‌: కేంద్ర మంత్రిస్మృతి ఇరానీ టిఆర్‌ఎస్‌ పార్టీపై మండిపడ్డారు. అభివృద్ధి కోసం గడిచిన ఐదేళ్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో వేలకోట్లు ఖర్చు చేసినట్లు టిఆర్‌ఎస్‌ అసత్యాలు చెబుతోందని ఆమె విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక ఎన్నికల నేపథ్యంలో స్మృతి ఇరానీ ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చి బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ప్రజలు తమ పార్టీకి మద్దతు తెలపాలని అన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలకు ఎందుకు ఓటు హక్కు కల్పించారని ఆమె నిలదీశారు. రోహింగ్యాలు, బంగ్లా దేశీయులకు ఏ నిబంధనల మేరకు ఓటు హక్కు ఇచ్చారని, ఇక్కడ అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల గురించి టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎందుకు మాట్లాడవని ఆమె నిలదీశారు. సుమారు 75,000 మంది విదేశీయులు అక్రమంగా హైదరాబాద్‌ నగరంలో ఎలా నివసిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. దేశాన్ని అక్రమ చొరబాటు దారుల నుంచి బిజెపి కాపాడుతుందని అన్నారు. తాము అందరితో కలిసి అందరి వికాసం కోసం పనిచేస్తామని చెప్పారు. వరద సాయంపై కేంద్ర సర్కారుకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదని ఆమె చెప్పారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/