రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం

రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేసారు. గాంధీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందువల్లే అభం శుభం తెలియని తన కూతురిని కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా చేసుకున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను తరచూ విమర్శిస్తున్నందుకు 18 ఏళ్ల తన కూతురు గోవాలో అక్రమంగా బార్‌ నడుపుతోందనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

’18 ఏళ్ల నా కూతురి వ్యక్తిత్వాన్ని కూనీ చేయాలని ఇద్దరు కాంగ్రెస్ నేతలు లక్ష‍్యంగా పెట్టుకున్నారు. నా కూతురు కాలేజీలో చదువుకుంటోంది. ఎలాంటి బార్ నడపటం లేదు. కావాలంటే పేపర్లు చూసుకోండి. ఆమె పేరు ఎక్కడుంది? నేను రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శిస్తున్నందు వల్లే నా కూతురిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా కుమార్తె రాజకీయ నాయకురాలు కాదు. సాధారణ విద్యార్థిని.’ అని స్మృతి ఇరానీ తెలిపారు. ఈ ఆరోపణలను స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ సైతం ఖండించారు. కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలన్ని నిరాధారమని అందులో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ చెబుతున్న రెస్టారెంటుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ జోయిష్‌ తన లాయర్‌ ద్వారా ఓ ప్రకటన విడుదల చేయించారు. అంతకుముందు స్మృతీ ఇరానీ కూతురు జోయిష్ ఇరానీ గోవాలో రెస్టారెంట్ నడుపుతున్నారని, అందులో ఫేక్ లైసెన్స్‌తో బార్ కూడా ఉందని కాంగ్రెస్‌ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా ఆరోపించారు. మోదీ ప్రభుత్వం స్మృతి ఇరానీని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.