దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

గత 24 గంటల్లో 2,151 కేసుల నమోదు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీగా నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఉదయం విడుదల చేసిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 2,151 కొత్త కేసులు నమోదయ్యాయి. 152 రోజుల విరామం తర్వాత ఒకే రోజులో పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలు దాటింది. చివరగా గతేడాది అక్టోబర్ 28న దేశంలో ఒక్కరోజే 2,208 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ క్రియాశీల కేసుల సంఖ్య 11,903కి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 శాతంగా ఉంది.

వైరస్ కారణంగా తాజాగా ఏడుగురు మరణించారు. మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటకలో ఒకరు, కేరళలో మరో ముగ్గురు మృతి చెందారు. దాంతో, దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,30,848కి పెరిగింది. దేశంలో ఇప్పటిదాకా 4.47 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.65 కోట్ల వ్యాక్సిన్‌లు అందజేశారు.