కరోనా ఎఫెక్ట్‌..సిక్కిం రాష్ట్రం కీలక నిర్ణయం

విదేశీ పర్యాటకులను నిషేధించిన సిక్కిం రాష్ట్రం..పర్మిట్ల జారీ సైతం నిలిపివేత

tourists- corona virus
tourists- corona virus

సిక్కిం: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) రోజురోజుకు పలు దేశాలకు విస్తరిస్తుంది. ఈనేపథ్యంలో తమ రాష్ట్రంలోకి విదేశీ పర్యాటకులకు ప్రవేశం లేదంటూ చైనా సరిహద్దుల్లోని సిక్కిం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియాలో విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. రాష్ట్ర పరిధిలోని గ్యాంగ్‌ టక్, డార్జిలింగ్, నాథులా తదితర ప్రాంతాల్లో ఉన్న హోటల్స్ లో విదేశీయులందరి బుకింగ్స్ నూ రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.మామూలుగా అయితే, మార్చి, ఏప్రిల్ నెలల్లో అమెరికన్లతో పాటు ఫ్రెంచ్, జర్మన్లు, జపనీయులు, చైనీయులు సిక్కిం రాష్ట్రానికి పర్యటనల నిమిత్తం వస్తుంటారు. విదేశీ పర్యాటకులను తీసుకుని రావద్దని వివిధ టూర్ ఆపరేటర్లకు సైతం ఆదేశాలు జారీ అయ్యాయి. పర్మిట్ల జారీని సైతం నిషేధిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి సిక్కిం, డార్జిలింగ్ తదితర ప్రాంతాల్లో విదేశీ పర్యాటకులు వారం రోజుల పర్యటనకు వస్తుంటారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశీ టూరిస్టులను ఎవరినీ అనుమతించవద్దని ప్రభుత్వ అధికారుల నుంచి ఆదేశాలు అందినట్టు క్లబ్ సైడ్ టూర్స్ అండ్ ట్రావెల్ యజమాని అమిత్ పెరివాల్ వెల్లడించారు.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/