మంచిర్యాలలో మద్యం మత్తులో ఎస్సై వీరంగం..

బాధ్యతగల ఉద్యోగంలో ఉన్న ఓ ఎస్సై ..మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..తిరుపతి అనే వ్యక్తి కరీంనగర్‌ జిల్లా బెజ్జంకిలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి మంచిర్యాల వచ్చిన తిరుపతి.. అర్థరాత్రి ఫుల్ గా మద్యం సేవించి ఐబీ చౌరస్తాలో వీరంగం సృష్టించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. బ్లూ కోర్టు సిబ్బంది అక్కడికి చేరుకొని , గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎస్సై తిరుపతికి సూచించారు. ఎస్సై తిరుపతి వినిపించుకోకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

ఆగ్రహించిన ఎస్సై తిరుపతి తన స్నేహితులతో కలిసి బ్లూ కోర్ట్ సిబ్బందిపై దాడికి దిగారు. పోలీసులపై దాడిని స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసు కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు ఎస్సై తిరుపతి అతని స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.