అంబర్‌పేట్‌లోని నారాయణ కాలేజీలో దారుణం

హైదరాబాద్ అంబర్ పేటలోని నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి సంఘం నాయకుడు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం ఇప్పుడు చర్చ కు దారితీసింది. ప్రిన్సిపల్ రూంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడే ఉన్న ప్రిన్సిపల్ తో పాటు ఏఓకు గాయాలలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని తొలుత సికింద్రాబాద్ యశోదా హస్పిటల్ కు ఆ తర్వాత డీఆర్డీవో అపోలో హాస్పిటల్ కు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. రామంతపూర్ కు చెందిన విద్యార్థి సాయి నారాయణ అంబర్పేట నారాయణ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండటంతో టీసీ కోసం కాలేజీ కి వెళ్ళాడు. ఫీజు బాకీ ఉండడంతో కాలేజీ యాజమాన్యం టీసీ ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేస్తున్నారు. దీంతో ఈరోజు స్టూడెంట్ యూనియన్ లీడర్లతో కలిసి కాలేజీ వద్దకు వెళ్లారు. టీసీ విషయంలో ప్రిన్సిపల్ ఆశోక్ రెడ్డికి విద్యార్థి సంఘం నాయకుడు సందీప్ కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విద్యార్థి సంఘం నాయకుడు వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని భయపెట్టే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో స్టూడెంట్ యూనియన్ లీడర్ సందీప్, విద్యార్థి వెంకటాచారితో పాటు ప్రిన్సిపల్ అశోక్ రెడ్డితో పాటు ఏఓకు గాయాలయ్యాయి. అయితే స్టూడెంట్ యూనియన్ లీడర్ స్వయంగా నిప్పు పెట్టుకున్నాడా లేక గదిలో దేవుడి ముందు వెలిగించిన దీపం అంటుకుని మంటలు చెలరేగాయా అన్నది తెలియాల్సి ఉంది.

మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాలేజీ ఆవరణతో పాటు ప్రిన్సిపల్ రూంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం స్టూడెంట్ యూనియన్ లీడర్ సందీప్ తో పాటు ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.