ఎంగిలి మెతుకులు
షిరిడీసాయి లీలలు
గర్వంత తగదు అని సాయిబాబా ఎన్నోసార్లు ఎందరికిలో, ఎన్నో సందర్భాలలో చెప్పటం జరిగింది.
దాసగణు సాయి వద్దకు వచ్చే భక్తుడు. సాయి మాట వలనే అతడు చేస్తున్న పోలీసు ఉద్యోగానికి రాజీనామా (పదవీ విరమణ) చేశాడు.
కొందరు దాసగణు మీద చాడీలు చెప్పేవారు. అవి చాడీలు కావచ్చు. సత్యాలు కావచ్చు. సాయిబాబా పట్టించుకునే వాడు కానేకాదు.
ఒకసారి సాయిబాబాతో దాసగణు లేనప్పుడు, ‘దాసగణు మీ పాద తీర్థం తీసుకొనుట లేదు అని చెప్పారు. సాయి అతనిని పిలిచి అందరూ నా పాద తీర్థం తీసుకుంటున్నప్పుడు నీవెందుకు తీసుకోవు అని దాసగణును అడగలేదు.
సాయి అలా చెప్పిన వారితో ‘ఎవరి నమ్మకం వారిది అన్నారు. ఒకరి నమ్మకాన్ని ఇతరుల కోసం మానుకోనక్కరలేదు.
శిక్కులకు పది మంది గురువులున్నారు. మొదటి గురువు నానక్. నానక్ అనంతరం గురుత్వాన్ని అంగడ్ అనే వ్యక్తి పొందాడు. అంగడ్ తన కాలంలో గురుత్వ సమయంలో అన్నదానం చేసేవాడు.
ఆ అన్నదానానికి అందరూ అర్హులే. అర్హత అనేది ఆకలి. ఆకలిగా ఉన్న ప్రతివాడు అక్కడకు భోజనశాలకు పోయి గురువుతో కూర్చుని భోజనం చేయవచ్చు.
గురువులేని సమయంలో కూడా భుజించవచ్చును. ధనిక దరిద్ర, స్త్రీ, పురుష, కుల మత వివక్షలేనేలేదు.
ఆ లంగరులో. లంగరు అంటే అన్నవితరణ శాల. భాయ్ జోఢ్జీ అనే వ్యక్తి సిక్కు మతంలో చేరాడు. గతంలో ఆయన బ్రాహ్మణుడు.
లంగరులో సేవ చేసేవాడు. సేవను నిజాయితీగా చేసేవాడు. భా§్ుజోఢ్ ప్రవర్తనను గమనించేవారు కూడా ఉన్నారు.
ఒకసారి గురు అంగడ్ వద్దకు భాయ్ జోఢ్ లేని సమయంలో ఫిర్యాదు చేశారు.
లంగరులో అందరితో కలసి భాయ్ జోఢ్ భుజించడని, భాయ్ జోఢ్ గతంలో బ్రాహ్మణుడే, కానీ ప్రస్తుతం శిక్కు మతానికి మారాడు.
శిక్కు మతంలో కులప్రసక్తి లేదు. కానీ జోఢ్కు పూర్వవాసనలు పోలేదని లంగరులో అందరితో కలసి భుజించడని గురువ్ఞకు చెప్పారు. గురువు అంగడ్ జోఢ్ని పిలిచి అడిగారు.
నీవు లంగరులో భుజించుట లేదా? అని. గురువుతో జోఢ్ ‘ఒకప్పుడు నేను బ్రాహ్మణుడనని, అగ్రగణ్యుడనని, తలచేవాడిని. అది నిజమే.
ఇప్పుడు మీ బోధలు విన్న తరువాత అందరూ సమానులేనని గ్రహించాను. కులగర్వంపోయింది.
లంగరులో అందరూ భోజనాలు చేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని ఒక పాత్రలో పెట్టుకుని ఆ భక్తులు తినగా మిగిలినది మాత్రమే తింటున్నాను అన్నాడు.
అందరూ, గురువుతో సహా ఈ మాటలు విన్నారు. గురువు అంగడ్ ఆనందించాడు.
‘ నీ గర్వం అంతరించింది. నను నీ హృదయంలో నివసిస్తున్నాను అన్నాడు గురు అంగడ్. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజున జోఢ్ లంగరులో అందరితోపాటు భుజిస్తున్నాడు.
ఒకరు జోఢ్ను ‘ఎంగిలి మెతుకులు తింటున్నానన్నావు కదా, మాతో కలసి ఎందుకు తింటున్నావు? అని ప్రశ్నించాడు.
‘మీ అందరి ముందే గురువు నా హృదయంలో నివసిస్తున్నానని చెప్పారు గదా అట్లా నా హృదయంలో నివసించే గురువుకు ఎంగిలిమెతుకులు ఎట్లా పెట్టేది? అందుకని ఆహారం తింటున్నాను అన్నాడు జోఢ్.
ఈ మాటలు వింటున్న గురువు అంగడ్ సంతసించాడు. గురువుకు ఎంగిలిపెట్టకూడదు. అంతేకాదు గురువుమనలో ఉంటున్నప్పుడు తప్పు చేయకూడదు!
– యం.పి.సాయినాథ్
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/