శిరిడీ సాయిబాబా ఆలయం రేపటి నుండి మూసివేత!

శిరిడీ సాయిబాబా జన్మ స్థలం చుట్టూ వివాదం
సాయి జన్మించిన పథ్రీని అభివృద్ధి చేస్తామన్న సీఎం

Shirdi Sai Baba
Shirdi Sai Baba

ముంబయి: శిరిడీలో కొలువైన సాయిబాబా జన్మ స్థలంపై వివాదం నెలకొంది. ఆయన జన్మించినది పథ్రీలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించడంతో వివాదం మొదలైంది. పథ్రీని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. శిరిడీతో సమానంగా దీనిని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం నిర్ణయంపై శిరిడీలోని సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పథ్రీని కనుక అభివృద్ధి చేస్తే శిరిడీకి భక్తుల రాక తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు నేడు శిరిడీ గ్రామస్థులంతా సమావేశం కానున్నారు. అలాగే, రేపటి నుంచి ఆలయాన్ని నిరవధికంగా మూసివేయనున్నట్టు ట్రస్ట్ ప్రకటించింది.

రేపు బంద్‌కు కూడా పిలుపునిచ్చిన ట్రస్ట్.. సాయి మందిరాన్ని పర్బణి జిల్లాకి తరలించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆరోపించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదివారం నుంచి ఆలయాన్ని మూసివేయనున్నట్టు ప్రకటించిన సాయి సంస్థాన్.. ఆలయంలోని అన్ని కార్యక్రమాలను నిలిపివేయనున్నట్టు పేర్కొంది. పర్బణి జిల్లాలోని పథ్రీ అనే ఊరే సాయిబాబా జన్మస్థలమన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. శిరిడీకి ఇది 275 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1854లో 16 ఏళ్ల వయసులో సాయి శిరిడీకి వచ్చారని, ఇక్కడే తొలుత ఓ వేపచెట్టు కింద సాయిబాబా కనిపించారని భక్తులు చెబుతుంటారు. సాయి జన్మస్థలం విషయంలో తెరపైకి వచ్చిన తాజా వివాదంతో భక్తుల్లో అయోమయం నెలకొంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/