న్యూజిలాండ్ టూర్కు శిఖర్ ధావన్ దూరం
బెంగళూరు: న్యూజిలాండ్ పర్యటన ముందు టీమిండియాకి భారీ షాక్ తగిలింది. భుజ గాయం కారణంగా భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ న్యూజిలాండ్ పర్యటనకు దూరమయ్యాడు. అయితే ధావన్ స్థానంలో బిసిసిఐ సెలెక్టర్లు ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. అయితే న్యూజిలాండ్తో టీ20, వన్డే సిరీస్కి ధావన్ దూరమవడంతో.. అతని స్థానంలో సెలెక్టర్లు ఎవరికి అవకాశం ఇస్తారో అని చర్చ మొదలైంది. గత ఏడాది గాయాలతో సతమతమైన శిఖర్ ధావన్.. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడ్డాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆడిన షాట్ను అడ్డుకునే యత్నంలో ధావన్ ఎడమ భుజానికి గాయమైంది. డైవ్ చేసిన తర్వాత అతడు తన ఎడమ భుజాన్ని కదలించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు మైదానాన్ని వీడాడు. గాయం తర్వాత ధావన్ చేతికి కట్టుతో కనిపించాడు. చహల్ ధావన్ బదులుగా ఫీల్డింగ్ చేసాడు. ఆపై బ్యాటింగ్ చేసేందుకు కూడా గబ్బర్ బరిలోకి దిగలేదు. దీంతో రోహిత్ శర్మకు జతగా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. మూడు వికెట్లు పడినా కూడా ధావన్ బ్యాటింగ్కు రాలేదు. గాయం తీవ్రత తెలుసుకునేందుకు భారత జట్టు మేనేజ్మెంట్ ధావన్కు ఎక్స్రే తీయించింది. కోలుకునేందుకు సమయం పట్టనుండంతో.. న్యూజిలాండ్తో జరిగే టీ20, వన్డే సిరీస్కి అధికారికంగా దూరమయ్యాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/