కాంగ్రెస్ అధ్యక్ష ఫలితాల వేళ.. శశిథరూర్ రిగ్గింగ్ ఆరోపణలు

ఉత్తరప్రదేశ్ లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపణ

shashi-tharoor-alleges-rigging-in-election

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆ పార్టీ నేత, అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగా చాలా అవకతవకలు జరిగాయని చెప్పారు. ఓట్ల లెక్కింపులో యూపీ ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మిస్త్రీని కోరారు. ఈ విషయంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు శశిథరూర్ తెలిపారు. మిస్త్రీ కార్యాలయంతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నట్లు శశిథరూర్ తరఫున ఎలక్షన్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్ సజ్ పేర్కొన్నారు. పోలింగ్ లో జరిగిన అవకతవకలపై మిస్త్రీ నోటీసుకు తీసుకెళ్లినట్లు వివరించారు.

కాగా, బ్యాలెట్ బాక్సులలోని ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 9500 కాగా, ఏఐసీసీ కార్యాలయంలో ఏడు నుంచి ఎనిమిది టేబుల్స్ పై కౌంటింగ్ జరుగుతోందని వివరించాయి. ప్రతీ టేబుల్ ముందు ఇద్దరు ఏజెంట్లు కూర్చుని ఓట్లు లెక్కిస్తున్నారని పేర్కొన్నాయి. సాయంత్రం 4 గంటల వరకు కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారని సమాచారం.