కేసీఆర్‌కు మాట నిలబెట్టుకునే మగతనం లేదా..? – షర్మిల

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. ‘ధాన్యం కొనుగోలులో కేంద్రం పెత్తనం ఏమిటి? ఆఖరి గింజ వరకూ నేనే కొంటా’ అని చెప్పిన కేసీఆర్‌కు మాట మీద నిలబడే మగతనం లేదా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంట చేతికొచ్చాక నేను కొనను అంటే రైతులు ఏమైపోవాలని, మీరు మాటమీద నిలబడే మొగనాళ్లు కాదా? అంటూ నిలదీశారు. వరి వద్దని చెప్పడానికేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది? అంటూ ధ్వజమెత్తారు.

ప్రజా ప్రస్థానం పాదయాత్రలో 21వ రోజు మంగళవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లిలో ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష నిర్వహించారు. అనంతరం సభలో మాట్లాడుతూ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నిరుద్యోగుల కోసం జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని కేసీఆర్.. తాగుబోతుల కోసం మద్యం నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదన్నారు. కొత్తగా 400కి పైగా మద్యం షాపులు ఎందుకు పెంచారని నిలదీశారు. మద్యం నియంత్రిచడం చేతగాక.. వ్యవసాయాన్ని నియంత్రిస్తున్నారని దుయ్యబట్టారు.