ఢిల్లీలో కవిత నిరాహారదీక్షపై స్పందించిన షర్మిళ

తెలంగాణలో రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదన్న షర్మిల

sharmila-satires-on-kavitha-hunger-strike

హైదరాబాద్‌: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 10న నిరాహారదీక్షకు దిగనున్నట్టు ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈవిషయంపై వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల సెటైర్లు వేశారు. రెండు సార్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీకి, కవితకు మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు గుర్తుకొచ్చాయా? అని ప్రశ్నించారు. కవిత నిరాహారదీక్ష చేస్తానని చెప్పడం బంగారం పోయిందంటూ దొంగలే ధర్నా చేసినట్టు ఉంటుందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిజాలు బయటపడతాయని కవిత భయపడుతున్నారని… అందుకే ప్రజలను, మీడియాను తప్పుదోవ పట్టించేందుకు మహిళా రిజర్వేషన్లు అంటూ కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు.

రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు తెలంగాణలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో మహిళలకు బిఆర్ఎస్ పార్టీ కేవలం రెండు సీట్లను మాత్రమే కేటాయించిందని గుర్తు చేశారు. 2018 ఎన్నికల తర్వాత కేబినెట్ లోకి కేవలం ఇద్దరు మహిళలను మాత్రమే తీసుకున్నారని విమర్శించారు. లిక్కర్ స్కామ్ కు పాల్పడిన కవిత మహిళలకు తలవంపులు తెచ్చారని అన్నారు.