కెసిఆర్ పై షర్మిల విమర్శలు

మీ పాలనలో మహిళకు దక్కుతున్న సత్కారాలకు సిగ్గుపడండి

హైదరాబాద్ : వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తమరి పాలనలో మహిళకు దక్కుతున్న సత్కారాలకు సిగ్గుపడండి కేసీఆర్ గారు అని మండిపడ్డారు. కేసీఆర్ దొరగారి ఖాకీలు చంటి పిల్లల తల్లులని కూడా చూడకుండా, వారితో అడ్డగోలు పని చేయించి, పాచిపోయిన అన్నం పెడతారా? అని ప్రశ్నించారు. అన్నం బాగోలేదని అంటే లాఠీలతో కొడతారా? అని దుయ్యబట్టారు. కాళ్లు పడితేనే అన్నం పెడతారా? అని మండిపడ్డారు.

పోడు చేసుకునే భూములను లాక్కోవద్దు అంటే గిరిజన మహిళా రైతులపై అక్రమ కేసులు పెట్టారని షర్మిల మండిపడ్డారు. ఆపై వారిని జైలుకు కూడా పంపి నరకం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ అహంకార పాలనపై మహిళా సైన్యం తిరగబడుతుందని అన్నారు. ఈ గిరిజన గళం రేపు మిమ్ములను తరిమి కొడుతుందని హెచ్చరించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/