సూడాన్‌లో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు

ఖార్టూమ్ : సూడాన్‌లో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. తాత్కాలిక ప్రధాని అబ్దుల్లా సహా పలువురు అధికారులను రహస్య నిర్బంధం విధించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే సూడాన్‌లో ఆర్మీ జనరల్‌ అబ్దెల్‌ ఫతాహ్‌ బుర్హాన్‌ అత్యవసర అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ అధికార మండలితో పాటు ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేశారు. సైన్యం తిరుగుబాటు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ క్రమంలో నిరసనకారులను అదుపు చేసేందుకు సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.

మొత్తం ఘర్షణల్లో ఏడుగురు మృతి చెందారని, 140 మంది వరకు గాయపడ్డారని ఆరోగ్య అధికారులు తెలిపారు. రెండేళ్ల క్రితమే ఒమర్​ అల్​ బషీర్​ సుదీర్ఘ పాలన నుంచి బయటపడి ప్రజాస్వామ్యం వైపు సుడాన్ అడుగులు వేస్తోంది​. ఈ తరుణంలో సైనిక తిరుగుబాటు జరగడం ఆ దేశానికి ప్రతికూలంగా మారనుంది. సైనికాధికారులు తిరుగుబాటుకు సెప్టెంబర్​లోనే ప్రయత్నించినా అది విఫలమైంది. అప్పటి నుంచి సుడాన్​ రాజకీయ నేతలు, మిలిటరీ అధికారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఆ దేశం సైనిక పాలనలోకి జారుకుంది. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపట్టాలని దేశంలోని ప్రజాస్వామ్య పార్టీలు పిలుపునిచ్చాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/