పాకిస్థాన్ లో దారుణం..ఏడుగురిని సజీవ దహనం చేసిన తండ్రి!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో దారుణం జ‌రిగింది. తాను చూపించిన యువకుడిని కూతురు పెళ్లి చేసుకోలేదన్న కోపంతో.. ఇంట్లోని ఏడుగురిని సజీవదహనం చేశాడో తండ్రి. ముజఫర్ గఢ్ జిల్లాకు చెందిన మంజూర్ హుస్సేన్ కు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడున్నారు. 2020లో చిన్న కూతురైన ఫౌజియా బీబీ.. మహబూబ్ అహ్మద్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఓ అబ్బాయి పుట్టాడు. ఆ పెళ్లి ఇష్టం లేని మంజూర్.. ఎప్పుడూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే ముజఫర్ గఢ్ లోనే ఉంటున్న తన ఇద్దరు కూతుళ్ల ఇళ్లకు తన కొడుకు సాబిర్ హుస్సేన్ తో కలిసి నిప్పు పెట్టాడు.

ఆ మంటల్లో బీబీ, ఆమె నెలల కుమారుడు, పెద్ద కూతురు ఖుర్షీద్ మాయి, ఆమె భర్త, నలుగురు చిన్నారులు ఆహుతైపోయారు. పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లిన బీబీ భర్త మహబూబ్ అహ్మద్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన రోజే అతడు తిరిగొచ్చాడు. అప్పటికే రెండు ఇళ్లూ మంట్లలో కాలిపోతుండడాన్ని గమనించిన అతడు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.

ఘటనపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో మంజూర్, సాబిర్ లను తాను అక్కడే చూశానని, వారిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా, పాక్ లో ఏటా వెయ్యికిపైగా పరువు హత్యలు జరుగుతున్నట్టు అక్కడి మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/