ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసిన స్పీకర్
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో లోక్ సభ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు.సభ నడవకుండా అడ్డు తగలడం, ఆందోళనలు చేయడం వంటి చర్యల నేపథ్యంలో వీరిపై ఈ బడ్జెట్ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ విధించారు. సస్పెండ్ అయిన వారిలో గౌరవ్ గొగోయ్, టీఎన్ ప్రతాపన్, డీన్ కురియాకోస్, ఆర్ ఉన్నిథాన్, మాణికం ఠాగూర్, బెన్నీ బెహ్నాన్, గుర్జీత్ సింగ్ ఔఝా ఉన్నారు. వాయిస్ ఓటింగ్ ద్వారా వీరి సస్పెన్షన్ కు సంబంధించిన తీర్మానాన్ని పాస్ చేశారు. కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ విధించిన వెంటనే రేపు 11 గంటలకు సభను స్పీకర్ వాయిదా వేశారు. ఢిల్లీ అల్లర్లపై ఈరోజు కూడా పార్లమెంటు ఉభయసభలు అట్టుడికాయి. విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/