రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ సి. నరసింహారావు మృతి

రాజకీయ, సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ సి. నరసింహారావు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్థరాత్రి (తెల్లవారితే గురువారం) 1.50 గంటల సమయంలో మరణించారు.

సి. నరసింహారావు 1948, డిసెంబర్ 28న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. స్వస్థలం క్రిష్ణాజిల్లా పెద్దపాలపర్రు. విజయీభవ, విజయపథం, వ్యక్తిత్వ వికాసం, అన్యోన్య దాంపత్యం, పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడం ఎలా?, బిడియం వద్దు, అద్భుత జ్ఞాపకశక్తి వంటి అనేక పుస్తకాలు రచించారు. ఈయన మృతి పట్ల నారాలోకేష్‌ , చంద్రబాబు లు సంతాపం తెలియజేసారు.

“ప్రముఖ సాహితీవేత్త, రాజకీయ, సామాజిక విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు సి. నరసింహారావు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.” అంటూ నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. జర్నలిస్టుగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా సమాజానికి ఆయన అందించిన సేవలు మరువ లేనివని అన్నారు. నరసింహారావు కుటుంబానికి చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.