సైదాబాద్లో ఆరేళ్ల బాలిక హత్యోదంతంపై సీతక్క ఆగ్రహం
ఘటనపై ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని మండిపాటు
హైదరాబాద్: హైదరాబాద్లోని సైదాబాద్లో ఇటీవల ఆరేళ్ల బాలిక తాము ఉంటోన్న పక్కింటి ఇంట్లో విగతజీవిగా కనపడిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ కుటుంబాన్ని ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. వినాయక చవితి రోజున నగర నడిబొడ్డున ఈ దారుణ ఘటన జరిగిందని, ఈ ఘటనపై ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆమె విమర్శించారు.
సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇప్పటికీ స్పందించకపోవడం ఏంటని సీతక్క నిలదీశారు. నిందితుడిపై చర్యలు తీసుకోకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతుతన్నాయని, నిందితుడికి గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందని ఆమె చెప్పారు.
గిరిజన బిడ్డకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించడం లేదని సీతక్క మండిపడ్డారు. ఎమ్మెల్యేలు కూడా మాట్లాడకపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమని, ఘటనాస్థలికి అధికారులను పంపి చేతులు దులుపుకుంటున్నారని ఆమె విమర్శించారు. కాగా, కాసేపట్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధిత బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/