రాజకీయ పార్టీల నేతలతో ఎస్ఈసీ సమావేశం
పురపాలిక ఎన్నికలపై ప్రాంతాల వారీ సమావేశాలకు నిర్ణయం
అమరావతి: ఏపి రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానుంది. అలాగే, పురపాలిక ఎన్నికలపై ప్రాంతాల వారీ సమావేశాలకు నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. అధికార యంత్రాంగం సన్నద్ధత కోసమే ఈ సమావేశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
ఈ నెల 27, 28, మార్చి 1న ప్రాంతీయ సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో సమావేశం నిర్వహిస్తామని వివరించింది. ఈ సమావేశాల్లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, మునిసిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో ఎస్ఈసీ సమావేశం కానుంది. ఈ నెల 27న (రేపు) ఐదు జిల్లాల్లో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఉంటుంది. అనంతరం, ఎల్లుండి విజయవాడలోని కార్యాలయంలో ఎస్ఈసీ సమావేశం నిర్వహిస్తుంది. ఇందులో మిగిలిన జిల్లాల అధికారులు పాల్గొంటారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/