ఎన్నికల కమిషన్‌ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

SC’s Constitution Bench orders panel consisting of Prime Minister, LOP, CJI for selecting Election Commissioners

న్యూఢిల్లీః ఎన్నికల కమిషన్‌ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎన్నికల కమిషన్‌ సభ్యులను నియమించడానికి ప్రధానితో పాటు సీజేఐ, విపక్ష నేత సభ్యుడిగా ఉండే కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిలను నియమించడానికి కొలీజియం వ్యవస్థ ఎలా ఉందో ఎన్నికల కమిషనర్లను నియమించడానికి కూడా అలాంటి వ్యవస్థ ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్లమెంట్లో చట్టం చేయాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు ఈ కమిటీనే కొనసాగుతుందని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంచేసింది.

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) నియామకాలకూ కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ నిర్వహించిన ఈ తీర్పును వెల్లడించింది. మాజీ అధికారి అరుణ్‌ గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించే ఫైల్‌ను 24 గంటల్లో అన్ని విభాగాల నుంచి వాయువేగంతో అనుమతి పొందడంపై సుప్రీంకోర్టు ఇదివరకే కేంద్రాన్ని ప్రశ్నించింది. గోయెల్‌ నియామక ఫైల్‌ను సమర్పించడానికి ప్రభుత్వ అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రధాని, చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా, ప్రతిపక్షనేత సభ్యులుగా ఉండే కమిటీ సూచించే వ్యక్తినే రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లుగా నియమించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది.

ఈ సందర్భంగా జస్టిస్ జోసెఫ్ మాట్లాడుతూ.. ‘‘గణనీయమైన, ఉదారవాద ప్రజాస్వామ్యం ముఖ్య లక్షణాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రజల శక్తితో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. బ్యాలెట్ శక్తి అత్యున్నతమైనది.. అత్యంత శక్తివంతమైన పార్టీలను సైతం గద్దె దింపగలదు..’’ అంటూ పేర్కొన్నారు. EC స్వతంత్రంగా ఉండాలి. రాజ్యాంగంలోని నిబంధనలు. కోర్టు ఆదేశాలకు లోబడి న్యాయమైన, చట్టపరమైన పద్ధతిలో వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని జస్టిస్ జోసెఫ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇకపపై ఎన్నికల కమిషనర్‌ నియామకం ప్రధానమంత్రి, సీజేఐ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ సిఫార్సుపై జరుగుతుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో జస్టిస్ అజయ్ రస్తోగి ఎన్నికల కమిషనర్లను తొలగించే విధానం CECల మాదిరిగానే ఉంటుందని ఈ తీర్పునకు జోడించారు.