మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ..కేంద్రానికి సుప్రీంకోర్టు నోటిసులు

మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం

Supreme court
Supreme court

న్యూఢిల్లీః బీబీసీ డాక్యుమెంటరీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. బీబీసీ డాక్యుమెంటరీని సెన్సారింగ్‌ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ పిటిషన్‌ను ఇవాళ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి నోటీసులు ఇష్యూ చేసింది.

అంతేగాక, ఆ నోటీసులకు మూడు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏప్రిల్‌లో చేపట్టనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా, గుజరాత్‌లోని గోద్రాలో 2002లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీబీసీ తాజాగా ఒక డాక్యుమెంటరీని రూపొందించింది.

అయితే, ఆ డాక్యుమెంటరీలో అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోడీకి, గుజరాత్‌ హోంమంత్రిగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సంబంధించి కొన్ని అభ్యంతరకర విషయాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని బిజెపి నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం డాక్యుమెంటరీని సెన్సార్‌ చేయకుండా అడ్డుకోవాలంటూ బీబీసీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దాంతో కోర్టు కేంద్రానికి తాజా ఆదేశాలు జారీచేసింది.