సీఏఏపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు

supreme court
supreme court

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు పౌరసత్వ చట్టంపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంపై స్టే ఇచ్చేందుకు మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏఏ రాజ్యంగ బద్ధతపై దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది, ఈ ధర్మాసనంలో సభ్యులుగా జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు కూడా ఉన్నారు. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి నాలుగువారాల గడువు ఇచ్చింది. అంతవరకు విచారణను వాయిదా వేసింది. దీని కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేసింది.

ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అత్యున్నత న్యాయస్థానం మొత్తం 140 పిటిషన్లను ఒకేసారి విచారణ చేసింది. పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌లతో పాటు మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా ఉన్నారు. ఇక జనవరి 10 నుంచి పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంపైన కూడా స్టే కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే దీనిపై స్టే ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/