భారీగా గృహ రుణ రేట్లను పెంచిన ఎస్బీఐ

అర శాతం పెంచుతున్నట్టు ప్రకటన
జూన్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని వెల్లడి


న్యూఢిల్లీ: గృహ రుణాలు తీసుకున్న వారిపై ఎస్బీఐ ఒకేసారి భారం మోపింది. వడ్డీ రేట్లను ఏకంగా అర శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 7.5 శాతం చేసినట్టు ఎస్బీఐ తెలిపింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటు 6.65 శాతం, దీనికి అదనంగా క్రెడిట్ రిస్క్ ప్రీమియం ఉంటుందని పేర్కొంది. నూతన రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.

ఇప్పటి వరకు ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు 6.65 శాతంగా, రెపో లింక్డ్ లెండింగ్ రేటు 6.25 శాతంగా ఉన్నాయి. వీటికి క్రెడిట్ రిస్క్ రూపంలో కొంత శాతాన్ని కలిపి రుణాలపై రేట్లను ఎస్బీఐ అమలు చేస్తుంటుంది. ఆర్బీఐ కీలక రేట్లను సవరించినప్పుడల్లా రుణాలపై రేట్లను బ్యాంకులు సైతం సవరిస్తుంటాయి. ఇటీవలే రెపో రేటును 0.40 శాతం మేర ఆర్బీఐ సవరించడం తెలిసిందే. దీనికంటే మరో 0.10 శాతం అదనంగా ఎస్బీఐ రుణ రేట్లను పెంచడం గమనార్హం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/