గాంధీ భవన్ లో సత్యాగ్రహ దీక్ష చేపట్టిన కాంగ్రెస్ నేతలు

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు సత్యాగ్రహ దీక్షకు పిలుపునివ్వగా హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు కాంగ్రెస్ నేతలు. అగ్నిపథ్‌ స్కీమ్‌ను వెంటనే రద్దు చేయాలంటూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, మహేష్‌ గౌడ్‌, అంజన్‌కుమార్‌, వీ.హనుమంతరావు, మల్లు రవి, రాములు నాయక్‌, కోదండరెడ్డి, సునీతారావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్ స్కీమ్‌తో దేశభద్రతకు ముప్పుని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఆర్మీలో కాంట్రాక్ట్ నియామక విధానం లేదని అన్నారు. నాలుగేళ్ల తర్వాత ఆ యువకుల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. అగ్నిపథ్‌తో రూ.5లక్షల కోట్ల పెన్షన్‌ను సేవ్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ స్కీమ్‌తో రక్షణశాఖలో 15శాతం రిక్రూట్‌మెంట్ ఆగిపోతుందని, పాక్, చైనా నుంచి ముంపు పెరిగే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరోవైపు ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష కు దిగింది. పార్టీ ఎంపీలతో పాటు వర్కింగ్ కమిటీ సభ్యులు, ఏఐసిసి ఆఫీసు బేరర్లు , రాహుల్ మొదలగు వారు ఈ దీక్షలో పాల్గొన్నారు.