ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మోడీ సేల్స్ మన్ గా పనిచేసారు – బండి సంజయ్

మోదీ ప్రధానిలా కాదు – సేల్స్ మెన్ లా వ్యవహరిస్తున్నారంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ ఫై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మోడీ సేల్స్ మన్గా పనిచేశారని సంజయ్ చెప్పుకొచ్చారు. నిన్న శనివారం రాష్ట్రపతి అభ్యర్ది యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్.. ఆయన సమక్షంలో ప్రధాని పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

మోడీ సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారంటూ మండిపడ్డారు. మత ద్వేషాలతో దేశాన్ని కలుషితం చేస్తున్నారన్నారు. మోడీ ప్రధానిలా కాదు – సేల్స్ మెన్ లా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. తాము ఇక మౌనంగా కూర్చోలేం – ఖచ్చితంగా పోరాడుతామని తేల్చి చెప్పారు. దేశంలో ఏం జరుగుతోందనేది ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఆకస్మికంగా కరోనా వేళ లాక్ డౌన్ ప్రకటించారని విమర్శించారు. తమ పైన రాజకీయంగా దాడి చేసేందుకు వస్తున్న ప్రధాని మోడీ.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రధాని అయ్యే సమయంలో అనేక హామీలు ఇచ్చారని.. ఒక్కటీ అమలు చేయలేదన్నారు. దేశం మొత్తం ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తోందంటూ దుయ్యబట్టారు. అందరి ఆదాయాలు పడిపోయి.. ఖర్చుల పెరగటం మోదీ పాలనలో ఘనతగా చెప్పుకొచ్చారు.

కాగా కేసీఆర్ చేసిన కామెంట్స్ ఫై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. లాక్ డౌన్ సందర్భంగా రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ఆక్సిజన్, పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ సరఫరా చేసినందుకు మోడీ బెస్ట్ సేల్స్ మన్ అని అభివర్ణించారు. ప్రజల కోసం పనిచేసిన వాళ్లను సేల్స్మన్ అంటే..మోడీ మంచి సేల్స్మన్ అవుతారని తెలిపారు. సీఎం కేసీఆర్ మాదిరిగా ప్రభుత్వ భూములను మోడీ విక్రయించలేదని చురకలంటించారు. ప్రధాని మోడీపై విమర్శలు చేసే ముందు తెలివితో మాట్లాడాలని కేసీఆర్కు సూచించారు. ప్రపంచంలో గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మోడీయే అని సర్వేలు చెబుతున్నాయన్నారు. కరోనా సమయంలో ప్రజలను రక్షించేందుకు మోడీ కృషి చేస్తే..కేసీఆర్ ఎక్కడికిపోయారని ప్రశ్నించారు. ప్రధానిని అవమానిస్తే ప్రజలు ఊరుకోరని..గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.