గొప్ప మనసు చాటుకున్న బర్నింగ్ స్టార్..స్వచ్ఛంద సంస్థ కు విరాళం

బర్నింగ్ స్టార్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. గతంలో హుధుద్ తుఫాను సమయంలో, కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎంతోమందికి తన శక్తి మేరకు విరాళం ఇచ్చి వార్తల్లో నిలిచిన సంపూర్ణేష్ బాబు..తాజాగా శ్రీయువ సేన స్వచ్ఛంద సంస్థకు రూ. 26 వేల విరాళం ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నారు. తాజాగా ఈయన నటించిన ‘క్యాలీఫ్లవర్’ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించాడు.

ఈ సందర్భంగా అభిమానులు సంపూర్ణేష్‌కు ఘన స్వాగతం పలికారు. పలువురు అభిమానులు సంపూ ఫేస్ మాస్కులు ధరించి సర్‌ప్రైజ్ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం శ్రీయువ సేన స్వచ్ఛంద సంస్థను సంపూర్ణేష్ సందర్శించాడు. వారు చేస్తున్న సహాయ కార్యక్రమాలకు తన వంతు ప్రోత్సాహకంగా రూ. 26వేలు నగదును విరాళంగా అందజేశాడు. ఇక క్యాలీఫ్లవర్ మూవీ విషయానికి వస్తే.. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. . ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.