మరోసారి సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు

ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ కాల్

Salman Khan donates
Salman Khan

ముంబయిః మరోసారి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి ఏకంగా ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ అగంతుకుడు ఫోన్ చేసి సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరించాడు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఫోన్ కాల్ తో అప్రమత్తమైన అధికారులు.. ఫోన్ చేసింది ఎవరనేది కనుక్కునేందుకు దర్యాఫ్తు ప్రారంభించారు. ఆగంతుకుడు తన పేరు రాకీ భాయ్ అని, జోధ్ పూర్ కు చెందిన గోరక్షకుడినని ఫోన్ లో చెప్పినట్లు సమాచారం. ఇందులో నిజానిజాలను తేల్చడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

గతంలోనూ సల్మాన్ ఖాన్ ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొన్నారు. కిందటి నెలలో 18, 23 తేదీలలో మెయిల్ ద్వారా దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కూడా సల్మాన్ ను చంపేస్తామని హెచ్చరించాడు. 2018లో విచారణ కోసం కోర్టుకు వచ్చిన బిష్ణోయ్.. కోర్టు ఆవరణలోనే బెదిరింపులకు పాల్పడ్డాడు. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరించిన ధాకడ్ రామ్ సిహాగ్ అనే దుండగుడిని రాజస్థాన్ పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. మరోవైపు, బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడకు వెళ్లాలన్నా ఫుల్ సెక్యూరిటీతోనే వెళుతున్నారు